కొన్ని వాక్యాలు చదువుతున్నప్పుడు నేను రాసిందే మళ్ళీ చదువుతున్నానేమో అనిపించింది. కొన్ని అనుభవాలని చదువుతున్నప్పుడు అవన్నీ నాక్కలిగినవే అని పదే పదే గుర్తొచ్చింది. 'ఇంకా ఏమేం రాసి ఉండొచ్చు?' అన్న ఆసక్తి, ఆసాంతమూ పుస్తకాన్ని వదలకుండా చదివేలా చేసింది. పుస్తకం పేరు 'నేను తిరిగిన దారులు.' నదీనదాలూ, అడవులు, కొండలు అనేది ఉప శీర్షిక. రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు. ఇది ఒక యాత్రా చరిత్ర.
కవి, రచయిత, సాహితీ విమర్శకుడిగా పేరున్న చినవీరభద్రుడు ఓ నిరంతర ప్రయాణికుడు కూడా. ప్రదేశాలని చూడడం కన్నా, ప్రపంచాన్ని చూడడానికి ఇష్టపడే ప్రయాణికుడు. ("కారు అద్దం నుంచి ప్రదేశాలని మాత్రమే చూడగలం, ప్రపంచాన్ని కాదు" అంటుంది
జానకి..) ఈ కారణం వల్లనే కావొచ్చు, బాగా తెలిసిన ప్రదేశాలని సైతం అతని కళ్ళతో చూసినప్పుడు ఓ కొత్త ప్రపంచం కనిపించింది.. వెంటాడింది... వెంటాడుతూనే ఉంది...